MCN NEWS : రబీ సీజన్ లో ప్రణాళిక బద్ధంగా సాగునీరు పంపిణీ చేపట్టి, శివారు భూములకు సాగునీరు ఎద్దడి లేకుండా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ లో రబీ సీజన్ లో సాగునీరు పంపిణీ ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా.. రెవిన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లాలో గోదావరి, ఏలేరు, పంపా రిజర్వాయర్ ఆయకట్ల కింద సాగవుతున్న పంటల వివరాలు, సాగునీరు లభ్యత, కాలువల పరిస్థితులను కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు. సాగు నీటి పంపిణీ, నియంత్రణలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ రబీ సీజన్ కు సంబంధించి రానున్న రెండు నెలలు అత్యంత కీలకమని ఇరిగేషన్, వ్యవసాయ అధికారుల ప్రణాళిక ప్రకారం పని చేసి రైతులకు సాగునీరు అందించాలన్నారు. ఇందుకు రెవిన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె తెలిపారు. జిల్లాలో గోదావరి ఆయకట్టు కింద – 1.35 లక్షల ఎకరాలు, ఏలేరు ఆయకట్టు కింద- 53 వేల ఎకరాల, పంపా రిజర్వాయర్ కింద సుమారుగా 10వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో నూరు శాతం ఈ -క్రాప్ బుకింగ్ పూర్తయిందని, రైతుల నుంచి ఈ-కేవైసీ కూడా పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా శివారు ప్రాంతాలైన తొండంగి, పిఠాపురం, గొల్లప్రోలు, తాళ్లరేవు, పెదపూడి మండలాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ శాఖ అనుమతులు లేకుండా అనధికారంగా సాగునీరు వినియోగించడాన్ని నివారించాలన్నారు. ఇందుకు మండల, గ్రామస్థాయిలో వ్యవసాయం, రెవిన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులతో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా సాగునీరును నియంత్రించే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు కాలువలపై పర్యవేక్షణ చేయడంతో పాటు వారాబందీ విధానం, నీటి మట్టం స్థాయిలను పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డా.డి.తిప్పే నాయక్, కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు ఇట్ల కిషోర్, జె.సీతారామరావు, జిల్లా వ్యవసాయ శాఖ జేడీ ఎన్.విజయ్ కుమార్, ధవళేశ్వరం నీటిపారుదల శాఖ ఎస్ఈ జీ. శ్రీనివాస రావు, పెద్దాపురం ఈఈ డి.రామ్ గోపాల్, పెద్దాపురం, కాకినాడ డీఈలు కె.నరేష్, ఎ.రవి, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.